Letter to Modi | కర్ణాటక హుబ్లికి చెందిన ఓ కాంట్రాక్టర్.. తాను చనిపోయేందుకు అనుమతి కోరుతున్నాడు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్లకు లేఖ రాశాడు. ఇక్కడి అధికారులు అడిగినంత కమీషన్లు ఇచ్చుకోలేకపోతున్నానని, తనకు మరణమే శరణ్యమని తన లేఖలో పేర్కొన్నారు. తనకు రావాల్సిన బిల్లులను క్లియర్ చేసేందుకు కర్ణాటక అధికారులు ఏకంగా 40 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని లేఖలో చెప్పడం కర్ణాటకలో కలకలం రేపింది. ఇప్పటికే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అవినీతిని ఎండగడుతూ అక్కడి వీధుల్లో ‘పేసీఎం’ పోస్టర్లు వెలిశాయి.
చిక్కమగళూరు జిల్లాలోని కడూరు, మూడిగెరె గ్రామ పంచాయతీలకు కొవిడ్-19 సంబంధ పరికరాలను సరఫరా చేశానని కాంట్రాక్టర్ బస్వరాజ్ మోదీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఇందుకు తనకు చెల్లింపులు జరుపకుండా అధికారులు కావాలని తాత్సారం చేస్తున్నారని, దాదాపు రూ.1.12 కోట్ల బిల్లలను పాస్ చేయడానికి 40 శాతానికంటే ఎక్కువ కమీషన్ ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని తెలిపాడు. సరఫరా జరిపి రెండేండ్లు కావస్తున్నా బిల్లులు పాస్ చేయడం లేదని, అప్పులపాలవడంతో ఇంక తాను బతకదల్చుకోలేదని వెల్లడించాడు.
గతంలో తన ఫిర్యాదు మేరకు బిల్లులు పాస్ చేయాలని పీఎంఓ, సీఎంఓ అధికారులు పలుమార్లు తాలూకా పంచాయతీ అధికారికి సూచించినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు లేఖలో తెలిపారు. తన లేఖలో కడూర్ ఎమ్మెల్యే బెల్లి ప్రకాశ్ పేరుతోపాటు తాలూకా పంచాయతీ అధికారి దేవరాజ్ నాయక్ పేరును కాంట్రాక్టర్ ఏ బసవరాజ్ ప్రస్తావించారు.