న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు త్వరలో దేశవ్యాప్తంగా యుక్త వయసు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సిన్ను పంపిణీ చేయనున్నారు. రెండేండ్ల క్రితం కేంద్ర బడ్జెట్లో చేసిన వాగ్దానాన్ని ఈ ఏడాది అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక టీకాను 14 ఏండ్లు దాటిన బాలికలకు ఉచితంగా అందించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2027 నాటికి దేశవ్యాప్తంగా 2.6 కోట్ల డోస్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. వ్యాక్సిమ్ కూటమి ‘గావి’ ఒక కోటి డోసులను భారత్కు సరఫరా చేయనున్నదని అధికారులు పేర్కొన్నారు.
మెర్క్ కంపెనీ ఉత్పత్తి చేసిన గర్డాసిల్ టీకాను బాలికలకు వేయనున్నట్టు తెలిపారు. ఈ వ్యాక్సిన్ నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది. ఒక డోసుతో బాలికలకు సంబంధిత వైరస్ల నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గర్డాసిల్ టీకా ధర ఒక డోసు రూ.3,927. పదిహేనేండ్ల లోపు బాలికలు రెండు డోసులు, 15 ఏండ్లు దాటిన వారు మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ కుమార్తెలకు ఈ వ్యాక్సిన్ను ఇప్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.