న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పటికే రెండుసార్లు దేశాన్ని వణికించింది. ఇక ఇప్పుడు మూడో వేవ్ ఎప్పుడొస్తుందా తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. అయితే కేసులు పెరగ్గానే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం.. కాస్త తగ్గగానే కనీసం మాస్కులు కూడా లేకుండా తిరగడం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే మరికొంత మందిలో ఈ మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఓవైపు విదేశాల్లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు మాస్కులు అవసరం లేదని అక్కడి ప్రభుత్వాలు చెప్పేశాయి. మన దగ్గర మాత్రం రెండు డోసులు తీసుకున్నా.. మాస్కులు పెట్టుకోవడం కొనసాగించండని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ మాస్కులు ఇంకెన్నాళ్లన్న ప్రశ్నపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు.
2022 వరకూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే అని వీకే పాల్ స్పష్టం చేశారు. దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడంతో థర్డ్వేవ్ ముప్పు ముంగిట్లో ఉన్నామని ఆయన అన్నారు. వ్యాక్సిన్లు, అత్యవసర మందులు, కఠిన ఆంక్షలతోనే కొవిడ్కు చెక్ పెట్టగలమని అన్నారు. ఇప్పుడే ప్రజలు రిలాక్స్ కావద్దని, అది ముప్పును మరింత పెంచుతుందని హెచ్చరించారు. ఇప్పటికే పండుగల సందర్భంగా భారీగా ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే కఠిన ఆంక్షలతో మొదట్లోనే కట్టడి చేయాలని స్పష్టం చేసింది.