President of India Elections 2022 | త్వరలోనే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జూలై 24వ తేదీతో రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నిక సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, అదే నెల 21న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో అసలు రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు ఎవరు ఎవరు అర్హులు? ఈ ఎన్నికలో ఎవరు ఓటేయొచ్చు? ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం రాష్ట్రపతి పదవికి పోటీచేసే అభ్యర్థికి కొన్ని నిబంధనలు విధించారు.. అవేంటంటే..
» రాష్ట్రపతి అభ్యర్థి కచ్చితంగా భారతీయుడై ఉండాలి.
» 35 ఏండ్ల వయసు నిండిన వాళ్లు మాత్రమే రాష్ట్రపతి పదవికి పోటీ చేయొచ్చు.
» లోక్సభ సభ్యుడికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉండాలి.
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎటువంటి సంస్థల్లో కూడా పదవిలో ఉండకూడదు.
» వీటన్నిటితో పాటు రాష్ట్రపతి అభ్యర్థికి పోటీ చేసే వ్యక్తిని ఎలక్టోరల్ సభ్యుల్లో 50 మంది ప్రతిపాదించాలి. మరో 50 మంది ఆ ప్రతిపాదనను ఆమోదించాలి.
» ఈ అర్హతలు ఉన్న వ్యక్తి నామినేషన్ వేయాలంటే రూ.15వేల డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిపాజిట్ తిరిగి రావాలంటే పోలయ్యి.. చెల్లిన ఓట్లలో 1/6 ఓట్లు రావాలి.
రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు మాత్రమే ఓటేస్తారు. పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఇద్దరికీ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటు వేసే హక్కు ఉంటుంది. అదే అసెంబ్లీల విషయానికొస్తే ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఎమ్మెల్సీలకు ఓటు వేసే ఛాన్స్ లేదు. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం ఎలక్టోరల్ కాలేజీఇలో4,896 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 4,120 మంది ఎమ్మెల్యేలు. 776 మంది ఎంపీలు. వీరందరి ఓటు విలువ ఒక్కరకంగా ఉండదు. ఎంపీ ఓటు విలువ 708 కాగా.. ఎమ్మెల్యేల ఓటు విలువ అంతకంటే తక్కువగా ఉంటుంది. అలా అని దేశంలోని అందరు ఎమ్మెల్యేల ఓటు విలువ ఒకరకంగా లేదు. ఒక్కో రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ ఒక్కో రకంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఓటుకు అత్యధిక విలువ ఉండగా.. సిక్కిం ఎమ్మెల్యే ఓటుకు అత్యల్ప విలువ ఉంటుంది.
ఒక రాష్ట్రంలోని మొత్తం జనాభా( 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం )ను ఆ రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాలి. అలా వచ్చిన సంఖ్యను 1000తో భాగిస్తే వచ్చే సంఖ్యను ఆ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువగా నిర్ణయిస్తారు. అత్యధిక జనాభా, అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యే ఓటు విలువ అధికంగా ఉంది.
2017 నాటి జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్లో 8,38,48,797 జనాభా ఉంది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ జనాభాను అసెంబ్లీ స్థానాలతో భాగించి, ఆ విలువను 1000తో మరోసారి భాగిస్తే 208.06 వస్తుంది. అదే ఆ రాష్ట్రంలోని ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 83,824గా ఉంది. ఇక అన్ని రాష్ట్రాల్లోని మొత్తం ఓట్ల విలువను మొత్తం ఎంపీల (లోక్సభ, రాజ్యసభ) సంఖ్యతో భాగిస్తే ఒక్కో ఎంపీ ఓటు విలువ వస్తుంది.
రాష్ట్రపతి ఎన్నికలు సాధారణ ఎన్నికల మాదిరి కాకుండా ప్రపోషనల్ రిప్రజెంటేషన్ పద్ధతిలో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ విధానంలో జరుగుతాయి. ఈ విధానంలో ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులు ఓటు వేస్తారు. ఒకవేళ ఈ ఎన్నికలో నలుగురు పోటీ చేశారని అనుకుందాం.. అప్పుడు మన ప్రాధాన్యత ప్రకారం ఒక్కొక్కరికీ ఒక్కో ర్యాంకు కేటాయించాల్సి ఉంటుంది. అలా తొలి ప్రాధాన్యత, రెండు, మూడు, నాలుగో ప్రాధాన్యత ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాలెట్ పేపర్లో ఒక వైపు అభ్యర్థి పేరు, మరోవైపు ప్రాధాన్యత ఓటుకు సంబంధించి రెండు కాలమ్స్ ఉంటాయి. పోలింగ్ సమయంలో ఎలక్టోరల్ సభ్యులు కేవలం ఈసీ ఇచ్చిన పెన్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ కూడా ఉండదు.
రాష్ట్రపతి ఎన్నిక బరిలో దిగిన ప్రతి ఒక్కరికీ.. ఎలక్టోరల్ సభ్యులు కచ్చితంగా తమ ప్రాధాన్యత ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో నోటాకు ఛాన్స్ లేదు. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. కాబట్టి ఎలక్టోరల్ సభ్యులు పార్టీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయవచ్చు. ఫలానా వ్యక్తికే ఓటు వేయాలని పార్టీలు విప్ జారీ చేయడానికి అవకాశం ఉండదు.
సాధారణ ఎన్నికల తరహాలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటించరు. పోలైన వాలిడ్ ఓట్లలో సగానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఇందుకోసం ముందుగా తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అందులో నిర్దేశిత కోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ నిర్దేశిత కోటా కంటే ఎక్కువ ఓట్లు రాకపోతే మళ్లీ లెక్కింపు మొదలుపెడతారు. అంతకంటే ముందు అందరికంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని తొలగించి.. ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతారు. అప్పుడు ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారినే విజేతగా ప్రకటిస్తారు. లేదంటే మళ్లీ ఇంతకుముందు పద్ధతిలో మళ్లీ ఓట్ల లెక్కింపు చేస్తారు. ఇలా పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరో ఒకరు గెలిచే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.