Crime news : ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నింది. కానీ కథ అడ్డం తిరిగడంతో కటకటాలపాలైంది. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని వడోదర (Vadodara) లో ఈ ఘటన చోటుచేసుకుంది. వడోదరలోని ఛననీలో గిరీశ్ పటేల్ (Girish Patel) అనే వ్యక్తి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అదే ఏరియాలో అతడు భార్య ఫాల్గుణి (Phalguni) తో కలిసి నివాసం ఉండేవాడు. గిరీశ్ పటేల్ పాన్ షాప్కు సమీపంలోనే కౌశిక్ శర్మ (Kaushik Sharma) అనే వ్యక్తి కటింగ్ షాప్ ఉంది. దాంతో రెండు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో గిరీశ్ పటేల్ భార్య ఫాల్గుణికి కౌశిక్ శర్మతో వివాహేతర బంధం ఏర్పడింది.
ఈ విషయం గిరీశ్ పటేల్కు తెలియడంతో భార్యను మందలించాడు. దాంతో తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఫాల్గుణి తన భర్త హత్యకు ప్లాన్ చేసింది. ప్రియుడితో విషయం చెప్పగా.. అతడు రూ.35 వేలకు కిరాయి హంతకులను మాట్లాడాడు. మొత్తం ఆరుగురు సభ్యుల ముఠా గిరీశ్ హత్యకు ప్రయత్నించింది. పాన్ షాప్ మూసి ఇంటికి వెళ్తున్న గిరీశ్ను కిరాయి ముఠా అడ్డగించి, కత్తులతో బెదిరించి బలవంతంగా కారులో ఎక్కించుకుంది. ఆ తర్వాత రాత్రంతా పలు ఏరియాలో తిప్పి చివరికి అతడిని ఓ కాలువలో పడేశారు. అతడు ఆ కాలువలో కొట్టుకుపోయి చనిపోతాడని భావించారు.
కానీ, అదృష్టవశాత్తు కాలువలో అతనికి ఒక రాయి దొరకడంతో తెల్లవారేదాకా మూడు గంటలపాటు అతడు ఆ రాయిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. మరుసటిరోజు స్థానికుల సాయంతో బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దాంతో పోలీసులు గిరీశ్ భార్య ఫాల్గుణిని, ఆమె ప్రియుడు కౌశిక్ శర్మను, ఆరుగురు కిరాయి హంతకులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది.