Supreme Court | న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: విద్వేషపూరిత ప్రసంగాలు తీవ్రమైన నేరాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదాసీనంగా వ్యవహరించరాదని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ర్టాలకు తేల్చి చెప్పింది. సమాజంలో వాతావరణాన్ని కలుషితం చేసే ద్వేషపూరిత ప్రసంగాలపై రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తే వాటిని కోర్టు ధిక్కరణగా భావిస్తామని హెచ్చరించింది. దీనిపై 2022లో తాము జారీ చేసిన ఉత్తర్వులను కొనసాగింపుగా.. ద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటో చర్యలు తీసుకోవాలని యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలకు సూచించింది. ఈ ప్రసంగాలపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా కేసులు నమోదు చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలను ఆదేశించింది. దీనిని తీవ్ర నేరంగా పరిగణించిన కోర్టు దేశ లౌకిక వ్యవస్థను నాశనం చేసే శక్తి ఈ ద్వేష ప్రసంగాలకు ఉన్నదని వ్యాఖ్యానించింది. విద్వేష ప్రసంగాలపై దాఖలైన పలు కేసులను శుక్రవారం విచారించిన సుప్రీం.. వీటిపై చర్య తీసుకోవడంలో విఫలమైన మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ‘
ఈ విద్వేష ప్రసంగాలను ఏ మతం వారు చేశారు అన్న విషయంతో సంబంధం లేకుండా చర్య తీసుకుంటున్నామని తద్వారా పీఠిక ద్వారా ఏర్పడిన భారత లౌకిక స్వభావానికి రక్షణ కల్పిస్తున్నాం’ అని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. అంతకుముందు ఈ ప్రసంగాలను పరిశీలించడానికి రాష్ర్టానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని పిటిషనర్లు కోరగా, జిల్లాకొక అధికారిని నియమించాలని సుప్రీం సూచించింది. అలాగే వీటిని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేయకుండా తగిన చర్యలు చేపట్టాలని పిటిషనర్లు కోరారు. అలాగే ద్వేష ప్రసంగాలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ కేఎం జోసెఫ్ మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్కు అనుమతి అవసరమని మేజిస్ట్రేట్ అనుకున్నారని, అలాగే 156(3)కు కూడా అనుమతి అవసరమని హైకోర్టు భావించిందని వెల్లడించారు. ‘న్యాయమూర్తులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారు. వారు పార్టీ ‘ఏ’కు చెందిన వారా.. పార్టీ ‘బీ’కి చెందిన వారా అన్నది ఆలోచించరు. ఆ సమయంలో వారి మస్తిష్కంలో భారత రాజ్యాంగం అన్న అంశం మాత్రమే ఉంటుంది’ అని వ్యాఖ్యానించిన ధర్మాసనం కేసును మే 12కు వాయిదా వేసింది.
అతీక్ను మీడియా ముందుకెందుకు తీసుకొచ్చారు?
గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్యపై యూపీ సర్కారుకు సుప్రీం కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. వారిని వైద్య పరీక్షల కోసం దవాఖాన గేటు వరకు అంబులెన్స్లో కాకుండా పరేడ్లాగా ఎందుకు నడిపించుకొని వెళ్లారని సూటిగా ప్రశ్నించింది. అసలు మీడియా ముందుకు ఎందుకు తీసుకొచ్చారని అడిగింది. ఈ విషయమై ప్రమాణ పత్రం సమర్పించాలని ఆదేశించింది. అతీక్ హత్య కేసులో స్వతంత్ర విచారణ జరిపించాలని న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. అతీక్, అష్రఫ్లను దవాఖానకు తీసుకొని వస్తున్నారన్న సమాచారం హంతకులకు ఎలా తెలిసిందని కోర్టు యూపీ సర్కారును ప్రశ్నించింది. దీనికి యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ ఈ విషయాన్ని విచారణ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, విచారణ కమిషన్ను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. గత 30 ఏండ్లుగా అనేక నేరాలకు పాల్పడిన అతీక్ కుటుంబంపై ఆగ్రహంతో ఉన్న వారెవరైనా ఈ హత్యలు చేసి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నదని ఆయన కోర్టుకు వివరించారు. 3 వారాల తర్వాత ఈ కేసును విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. యూపీలో 2017 నుంచి ఇప్పటి వరకు జరిగిన 183 ఎన్కౌంటర్లపైనా విచారణ జరపాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు.