న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: రిటైర్డ్ జిల్లా జడ్జీలకు నెలకు రూ.19,000 నుంచి రూ.20,000 మాత్రమే పింఛను లభిస్తున్నదని, ఇంత తక్కువ సొమ్ముతో వారు గౌరవప్రదంగా ఎలా జీవించగలుగుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జడ్జి పదవిని నిర్వహించిన వ్యక్తి పూర్తిగా అశక్తుడైపోతాడని, 61, 62 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉండదని వ్యాఖ్యానించింది. ఆలిండియా జడ్జస్ అసోసియేషన్ పిటిషన్పై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ, దీనికి సరైన పరిష్కారం రావాలన్నారు. జిల్లా జడ్జిలు చాలా ఇబ్బందిపడుతున్నారన్నారు. ధర్మబద్ధమైన పరిష్కారం కోసం సహాయపడాలని అటార్నీ జనరల్ ఆర్ వేంకట రమణిని కోరారు. సు ప్రీంకోర్టు అంతకుముందు స్పందిస్తూ, ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉంటారని ప్రజలు నమ్ముతారని, ఈ నమ్మకాన్ని పరిరక్షించాలంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలని తెలిపింది. జడ్జీలు ఆర్థికపరంగా గౌరవప్రదంగా జీవించగలిగినపుడే ఇది సాధ్యమవుతుందని వివరించింది.