Maha CM Eknath Shinde | మహారాష్ట్ర నూతన సీఎంగా శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారంలో కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరించారని కనిపిస్తున్నది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఫడ్నవీస్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని వార్తలొచ్చాయి. కానీ, గురువారం సాయంత్రం ఏక్నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు చేపడతారని, తాము షిండే సర్కార్కు మద్దతు ఇస్తామని ఫడ్నవీస్ ఆశ్చర్యకర ప్రకటన చేశారు. ఫడ్నవీస్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని వదంతులు వచ్చినా.. షిండే క్యాబినెట్లో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉంటారని బీజేపీ నాయకత్వం అసలు సంగతి బయటపెట్టింది.
ఒకప్పుడు శక్తిమంతంగా భావించిన ఉద్ధవ్ ఠాక్రేను కట్టడి చేయడానికి బీజేపీ వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా వ్యవహరించిందని తెలుస్తున్నది. వారం క్రితం.. ఒకవేళ నేను వైదొలిగితే శివసైనిక్ సీఎం అవుతారని గ్యారంటీ ఉందా? అని ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో ఏక్నాథ్ షిండేను సీఎంగా నియమించడం ద్వారా అధికారం కోసం అర్రులు చాస్తుందన్న విమర్శలకు బీజేపీ నాయకత్వం చెక్ పెట్టింది.
సిద్ధాంత పరంగా వ్యతిరేక పార్టీలతో జత కట్టడం ద్వారా శివసేన హిందుత్వ సిద్ధాంతం బలహీనం అవుతుందని ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్నాథ్ షిండే పదేపదే ఫిర్యాదు చేస్తూ వచ్చారు. తమదే అసలైన శివసేన అని వాదిస్తున్నారు. మరాఠా ఎమ్మెల్యేగా.. మహారాష్ట్రలో బీజేపీ బలోపేతం కావడానికి ఏక్నాథ్ షిండే బోనస్గా దొరికారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికారం కోసం విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేదని బీజేపీపై నిత్యం విమర్శలు వచ్చిన తరుణంలో మాజీ సీఎం ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంగా పని చేయడం కమలనాథుల వ్యూహంలో మార్పు కనిపిస్తున్నది.
ఏక్నాథ్ షిండేను సీఎంగా నియమించడం ద్వారా మున్ముందు బాల్ ఠాక్రే తనయుడు ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా, పార్టీ పేరు, చిహ్నం కోసం ఏక్నాథ్ షిండే పోరాటం చేయనున్నదన్న సంకేతాలిచ్చారు. మహారాష్ట్రలో అధికార మార్పిడి పూర్తిగా శివసేనలో అంతర్గత పోరు ఫలితమనే వాదనను బీజేపీ ముందుకు తెస్తున్నది. ఏక్నాథ్ షిండే పూర్తిగా శివసేనపై కంట్రోల్ తెచ్చుకున్నారని, ఉద్ధవ్ ఠాక్రే కుటుంబం నుంచి శివసేనను దూరం చేయడమే కమలనాథుల అసలు వ్యూహం అని విశ్లేషకులు అంటున్నారు.
శివసేన ఏర్పాటైనప్పటి నుంచి ఠాక్రే కుటుంబం చుట్టే తిరిగింది. పార్టీపై పూర్తి పట్టు ఠాక్రేలదే. 2019లో శివసేనతో కలిసి పోటీ చేసినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. బీజేపీతో పాతకాలం నాటి పొత్తుకు స్వస్తి పలికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్లతో ఉద్ధవ్ ఠాక్రే చేతులు కలిపారు. దీనికి ప్రతిగా ఏక్నాథ్ షిండేను సీఎంను చేసి.. ఉద్ధవ్పై బీజేపీ ప్రతీకారం తీర్చుకున్నట్లైందని విశ్లేషకులు అంటున్నారు.
ఉద్ధవ్ ఠాక్రేతో పోలిస్తే ఏక్నాథ్ షిండే మరింత విధేయుడు. ఠాక్రేలు లేని శివసేన పవర్ సెంటర్గా ఉంటుందంటే ఒకప్పుడు ఊహించడం కూడా కష్టమే. సీఎంగా ఏక్నాథ్ షిండే.. రాష్ట్ర వ్యాప్తంగా శివసైనిక్లను తన వైపుకు తిప్పుకోవడానికి శక్తియుక్తులు ప్రదర్శించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే బీజేపీ పని తేలికవుతుంది. శివసేన బలహీన పడితే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలతోనే బీజేపీ నేరుగా తలపడుతుందని అంటున్నారు.