గోరఖ్పూర్ : విద్యుత్తు బిల్లు మొత్తం స్వీకరణ సందర్భంగా చోటు చేసుకొన్న చిన్న తప్పిదం.. మొత్తం విద్యుత్తు శాఖ అధికారులను కలవరానికి గురిచేసింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన చొహరీ దేవి అనే మహిళకు రూ.4,950 కరెంట్ బిల్లు వచ్చింది. అయితే దీన్ని చొహరీ దేవి కుమారుడు సంబంధింత చెల్లింపు కేంద్రానికి వెళ్లి కట్టగా.. అక్కడ పొరపాటున రూ.197 కోట్లు చెల్లించినట్టు రసీదు ఇచ్చారు. ఆ తర్వాత కరెంట్ బిల్లుల మొత్తానికి, వసూలైన సొమ్ముకు పొంతన కుదరక అధికారులు గందరగోళానికి గురయ్యారు. కంప్యూటర్ ఆపరేటర్ కరెంట్ బిల్లు మొత్తం రూ.4,950కు బదులుగా బిల్లు కాగితంలోని 197..తో మొదలైన కనెక్షన్ నంబర్ను నమోదు చేయడంతో తప్పిదం దొర్లినట్టు గుర్తించారు.