లక్నో : ఓ తండ్రి, తన ఇద్దరు కుమారులు రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకున్నారు. అందుకు పథకం ప్రకారం ముందుకు వెళ్లారు. అత్యాశకు వెళ్లిన వారు అడ్డంగా బుక్కయ్యారు. వారి మోసం వెలుగులోకి రావడంతో గ్రామస్తులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని మహముద్పూర్ గ్రామానికి చెందిన అశోక్ కుమార్ ఆర్థిక బాధల్లో మునిగిపోయాడు. డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచించాడు. ఇక తన ఇద్దరు కుమారులు రవి, విజయ్తో కలిసి తండ్రి ఓ పథకం రచించాడు.
ఆ పథకం ఏంటంటే.. కొన్ని దేవతామూర్తుల విగ్రహాలను ఆన్లైన్లో కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక సరస్వతి, లక్ష్మీదేవి, తాబేలు విగ్రహాలతో పాటు రుద్రాక్షను రూ. 169కి కొనుగోలు చేశారు. వాటిని తమ భూమిలో పాతిపెట్టారు. మరుసటి రోజు భూమిని తవ్వుతుండగా ఆ విగ్రహాలు బయటపడ్డాయని కట్టుకథ అల్లారు. ఇక ఊరంతా ప్రచారం చేశారు. అక్కడికి వచ్చిన భక్తులు, గ్రామస్తులు ఆ విగ్రహాలకు పూజలు చేయడం మొదలుపెట్టారు. భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకున్నారు. రూ. 30 వేల వరకు విరాళాలు కూడా సేకరించారు.
అసలు విషయం ఇలా వెలుగులోకి.. అయితే అశోక్ కుమార్ భూమిలో విగ్రహాలు బయటపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు అశోక్ కుమార్ భూమి వద్దకు చేరుకున్నారు. ఆ విగ్రహాలను పరిశీలించి చూడగా, అవి పురాతనమైన విగ్రహాలు కావని అధికారులు నిర్ధారించారు. దీంతో అశోక్ను, ఆయన కుమారులను గట్టిగా ప్రశ్నించగా, చేసిన నేరాన్ని అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.