స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, జనవరి 22, (నమస్తే తెలంగాణ): లంచాలు తింటూ నాసిరకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అధికారుల డొంక కదులుతున్నది. ఈ వ్యవహారంపై ‘ఆపరేషన్ కనక్’ పేరుతో సీబీఐ జరుపుతున్న విచారణలో అక్రమాల గుట్టు బయటపడుతున్నది. అక్రమాలకు పాల్పడిన ఢిల్లీ, చండీగఢ్కు చెందిన పలువురు ఎఫ్సీఐ అధికారులు, ఉద్యోగులు, మాజీ ఉద్యోగులతో పాటు రైస్ మిల్లర్స్, గిడ్డంగుల యజమానులు సహా మొత్తం 52 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
లంచాల్లో వాటాలు పంచుకొని
పంజాబ్లోని రైస్ మిల్లులు, గోదాముల్లో నిల్వ ఉన్న నాసిరకం ఆహార ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక్కో ట్రకుకు రూ.4,000 చొప్పున ఎఫ్సీఐ అధికారులు వసూలు చేశారు. ఈ మొత్తంలో ఎఫ్సీఐ జనరల్ మేనేజర్కు రూ. 200, నలుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్లకు రూ.50 చొప్పున, ల్యాబొరేటరీలలోని రిసెర్చ్ ఆఫీసర్లకు రూ.20, ఎగ్జిక్యూటివ్కు రూ.100 వెళ్లాయని, ఢిల్లీలోని ఎఫ్సీఐ ప్రధాన కార్యాలయంలోని కొందరికీ వాటాలు వెళ్లినట్లు సీబీఐ పేర్కొంది. వాస్తవానికి ఒక్కో నాసిరకం ధాన్యం ట్రకు విలువ రూ.1,050 మాత్రమేనని పేర్కొంది. ఢిల్లీలో ఎఫ్సీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదీప్ సింగ్, అతని భార్య అమృతప్రీత్ కౌర్పై సీబీఐ కేసు నమోదు చేసింది. అక్రమాలకు పాల్పడుతున్న వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టనందుకు వీరికి రూ.15 లక్షల లంచం, ఓ యాపిల్ వాచ్ ముట్టచెప్పినట్లు సీబీఐ ఆరోపించింది.
ఇదే ధాన్యం దేశమంతా సరఫరా
ఈ నాణ్యత లేని నాసిరకం ఆహార ధాన్యాలు ఆ తర్వాత దేశమంతటా రవాణా అవుతాయి. ఇప్పటి వరకు నిందితుల ఇళ్లలో సుమారు కోటి రూపాయలను స్వాధీనం చేసుకోగా, ఆ మొత్తానికి లెక చూపలేదు అని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలో 35 రైస్ మిల్లులు, గిడ్డంగులు ఉండగా అందులో 33 అధికారులకు లంచాలు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.