న్యూఢిల్లీ : ఇరాన్ యుద్ధం భారత్ వంట గదులను తీవ్రంగా దెబ్బ కొట్టింది. గ్యాస్ కొరత కారణంగా దేశంలో 50 శాతానికి పైగా హోటళ్ల యజమానులు, వీధి వ్యాపారులు ఆహారాల ధరలను పెంచేశారు. కొందరు బ్లాక్ మార్కెట్లో భారీ ధరకు గ్యాస్ కొనలేక తాత్కాలికంగా వ్యాపారాలను మూసేశారు. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. 57 శాతం రెస్టారెంట్లు, 54 శాతం వీధి వ్యాపారులు తాము అమ్మే ఆహార పదార్థాల ధరలను ఒక వారంలోనే పెంచేశారు.
దీంతో తమ నెలవారీ బడ్జెట్ ఖర్చు పెరిగిపోయిందని సామాన్యులు వాపోయారు. సర్వేలో పాల్గొన్న వారిలో యాభై శాతానికి పైగా ప్రజలు తినుబండారాల ధరలు 10-25 శాతం పెరిగాయని తెలిపారు. సర్వేలో వెల్లడైన ఇతర వివరాల ప్రకారం.. బ్లాక్ మార్కెట్లో కిలో గ్యాస్ ధర రూ.400 పెరిగింది. హోటళ్లలో ఆహార ధరల పెంపుతో పాటు ఎల్పీజీ బాదుడు చార్జిల పేరుతో రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారు.