Ahmedabad : మ్యారేజ్ యానివర్సరీ అంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, పిల్లలతో ఆనందంగా జరుపుకొంటారు. కానీ, గుజరాత్, అహ్మదాబాద్లో మాత్రం ఒక జంట ఇల్లీగల్ పార్టీగా మార్చింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ మద్యం, హుక్కా వంటివి అందించారు. అహ్మదాబాద్లోని నిర్వాణ గ్రీన్ వీకెండ్ హోమ్స్లో బుధవారం అర్ధరాత్రి ఈ లగ్జరీ, ఇల్లీగల్ పార్టీ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇక్కడ ఒక సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ పార్టీ జరిగింది. ఇది రూల్స్కు విరుద్ధంగా జరుగుతున్న పార్టీ అని రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు ఈ వేడుక జరుగుతున్న ప్రదేశంపై దాడులు చేశారు. అక్కడ భారీగా విదేశీ మద్యం సరఫరా చేస్తున్నారు. అలాగే గెస్టులు హుక్కా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు పలు విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కా మెటీరియల్, లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సిటీలోని డాక్టర్లు, వ్యాపారవేత్తలు, బిల్డర్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో ఎక్కువమంది దాదాపు 35-45 ఏళ్ల వయసున్న వాళ్లే. 43 మంది మగవారు, 38 మంది మహిళలున్నారు. మొత్తం 81 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో మగవారిని టెస్టుల కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. ఆడవారికి లీగల్ నోటీసులు ఇచ్చి వదిలేశారు.
అందరూ సంపన్నవర్గాలకు చెందినవారే కావడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పార్టీని ఎవరు హోస్ట్ చేశారు.. ఈవెంట్ నిర్వహించింది ఎవరు.. ఇంకా ఏయే పదార్థాలు అందించారు వంటి అంశాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ఇలాంటి ఇల్లీగల్ పార్టీలు ఎక్కువ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.