ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన భారత అరంగేట్రం క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా థార్ వాహనాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీలకు 12లక్షల విలువైన బ్రాండ్ న్యూ SUV మహీంద్రా ‘థార్’ వాహనాలను బహుమతులుగా అందజేశారు.
తాజాగా యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ ఆ ప్రత్యేకమైన బహుమతిని అందుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ బయో బబుల్లో ఉన్నందున గిల్ స్వయంగా థార్ను అందుకోలేకపోయాడు. థార్ను గిఫ్ట్గా ఇచ్చిన ఆనంద్ మహీంద్రాకు ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.
‘మహీంద్రా థార్ను స్వీకరించడం గొప్ప అనుభూతి. అద్భుతమైన వాహనాన్ని అందుకోవడానికి అక్కడ ఉండాలని కోరుకున్నాను. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న ఆనంద్ మహీంద్రా సర్కు ధన్యవాదాలు. భారత్ తరఫున ఆడటం గౌరవంగా ఉంది. నేను మైదానంలో అడుగుపెట్టిన ప్రతీసారి ఉత్తమ ప్రదర్శన చేయాడనికి ప్రయత్నిస్తాను’ అంటూ గిల్ ట్వీట్ చేశాడు.