Supreme Court : దేశంలో గృహిణుల శ్రమపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణులు దేశ నిర్మాతలు అని, వారు చేసే పనికి కనీసం రూ.30,000 పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల్లో గృహిణులు మరణించినా, వైకల్యం సంభవించినా నెలకు కనీస పరిహారం కింద ఈ మొత్తం చెల్లించాలని సూచించింది. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ సంజయ్ కరోల్, కే కోటిశ్వర్ సింగ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా మరణించినా లేదా వైకల్యం సంభవించినా బాధితుల ఆదాయం వంటి వివరాల ఆధారంగా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం అందిస్తాయి.
ఈ నేపథ్యంలో ఒక కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాల్లో గృహిణులు మరణిస్తే బాధితులకు నెలకు రూ.30,000 పరిహారం అందించాలని ఆదేశించింది. గృహిణులను దేశ నిర్మాతలుగా అభివర్ణించింది. వారు ఇంటి పని చేస్తూ, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని చూసుకుంటారని, వారి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని, అంతిమంగా దేశాభివృద్ధికి దోహదపడతారని కోర్టు అభిప్రాయపడింది. వారు ఇంట్లో చేసే పనులతో ఆదాయం సంపాదించకపోయినంతమాత్రాన వారి పనితనానినికి వెల కట్టలేమని కాదని, సగటున కనీసం రూ.30,000 చెల్లించాలని ఆదేశించింది. సాధారణంగా గృహిణులు చేసే పనులకు పరిహారం తక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే ఈ పనిని ఇటు కూలీ పనిలాగా కాకుండా, అటు స్కిల్డ్, నాన్ స్కిల్డ్ పనిలాగా కాకుండా చూస్తారు.
అందుకే పరిహారం విషయంలో గృహిణులకు తగిన న్యాయం జరగడం లేదు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు అనుగుణంగా ఇకపై గృహిణులు మరణిస్తే వారి కుటుంబాలకు ప్రతి నెలా కనీస పరిహారం అందే అవకాశం ఉంది. 2001లో పంజాబ్లో ఒక మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె తరఫున పరిహారం కోరుతూ భర్త, ముగ్గురు పిల్లలు మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అనంతరం ఈ అంశం వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతూ.. చివరికి సుప్రీంకోర్టు వరకు చేరింది. తాజాగా కోర్టు వారికి అనుకూలంగా, పరిహారం చెల్లించాలని ఆదేశించింది.