Supreme Court : గృహ కొనుగోలుదారుల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఫ్లాట్ నిర్మాణంలో జాప్యం జరిగినప్పుడు.. దానిని అప్పగించిన తర్వాత కూడా బిల్డర్ (Builder) నుంచి నష్టపరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. కేవలం ఫ్లాట్ను స్వీకరించినంత మాత్రాన ఆలస్యానికి సంబంధించిన నష్టపరిహారం పొందే హక్కు రద్దు కాదని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ తీర్పు రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేసింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 2016 లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఒక కేసును పునర్విచారణకు స్వీకరించింది. “నిర్మాణ జాప్యానికి సంబంధించిన నష్టపరిహారం అనేది ఫ్లాట్ అప్పగించడానికి ముందు కాలానికి వర్తిస్తుంది. కేవలం ఫ్లాట్ను స్వాధీనం చేసుకున్నంత మాత్రాన, ఆ జాప్యానికి పరిహారం కోరే హక్కును కొనుగోలుదారులు కోల్పోరు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కాగా ఢిల్లీకి చెందిన టీకేఏ పద్మనాభన్ అనే వ్యక్తి అభియాన్ కోఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీపై 2005లో దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. ఫ్లాట్ అప్పగింతలో తీవ్ర జాప్యం జరిగిందని ఆయన వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించారు. అయితే ఒప్పందంలోని ఆర్బిట్రేషన్ క్లాజ్ను ప్రాతిపదికగా తీసుకుని కింది కోర్టులు ఈ కేసును మధ్యవర్తిత్వానికి పంపాయి. ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వినియోగదారుల రక్షణ చట్టం-1986 అనేది ప్రైవేట్ ఆర్బిట్రేషన్ నిబంధనలకు అతీతంగా వినియోగదారులకు అదనపు రక్షణ కల్పిస్తుందని న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ కేసును ఏడాదిలోగా పరిష్కరించాలని ద్వారక జిల్లా వినియోగదారుల ఫోరమ్ను సుప్రీంకోర్టు ఆదేశించింది.