న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగట్ మరణంపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. కేంద్ర దర్యాప్తు కోరుతూ గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాసిన లేఖపై సానుకూలంగా స్పందించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించిందని సంబంధిత అధికారులు పీటీఐ వార్తా సంస్థకు సోమవారం వెల్లడించారు.
కాగా, హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలైన సోనాలీ ఫోగట్ ఆగస్ట్ 22న గోవాలో అనుమానాస్పదంగా మరణించారు. తొలుత ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే సోనాలీ శరీరంలో అంతర్గతంగా గాయాలున్నట్లు పోస్ట్మార్టం రిపోర్టులో వెల్లడైంది.
మరోవైపు సోనాలీ వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సాంగ్వాన్ ఆమెపై లైంగిక దాడి జరిపి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తల్లి మరణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని సోనాలీ చిన్న కుమార్తె డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సుధీర్ సాంగ్వాన్, ఆమె స్నేహితుడు సుఖ్వీందర్ వాసితోపాటు మరో ముగ్గురిపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. సోనాలీ మరణానికి సంబంధించి ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.