రాంచీ: భర్తల దీర్ఘాయువు కోసం కొందరు మహిళలు పూజలు చేస్తుండగా ఉన్నట్టుండి పవిత్ర చెట్టుకు మంటలు వ్యాపించాయి. దీంతో పూజలు చేస్తున్న మహిళలు ఆందోళన చెందారు. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. జార్ఖండ్లోని చత్రా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం వట పూర్ణిమ సందర్భంగా తమ భర్తల శ్రేయస్సు కోసం మహిళలు వట సావిత్రి వత్రాన్ని (Vat Savitri Puja) ఆచరించారు. ఉపవాసం ఉన్న మహిళలు స్థానిక గండౌరి ఆలయంలోని మర్రి చెట్టుకు ఎర్రని దారం కట్టి ప్రత్యేక పూజలు చేశారు. తమ భర్తలు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థించారు.
కాగా, మహిళలు వెలిగించిన అగరబత్తి అక్కడి కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులపై పడింది. దీంతో మంటలు చెలరేగాయి. ఆ పవిత్ర చెట్టుకు చుట్టిన దారాలకు వ్యాపించాయి. మంటలు పెద్దగా ఎగసిపడటంతో అక్కడున్న భక్తులు ఆందోళన చెందారు. వెంటనే స్పందించిన పోలీసులు స్థానికుల సహాయంతో ఆ మంటలను ఆర్పివేశారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భర్తల దీర్ఘాయుష్షు కోసం మహిళలు పూజలు చేస్తుండగా పవిత్ర చెట్టుకు మంటలు వ్యాపించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.