న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దోషులతో పాటు అనుమానితుల కొలతలు, బయోమెట్రిక్, జీవ నమూనాలను సేకరించేందుకు అవకాశం కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లును సోమవారం లోక్సభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ఈ బిల్లు నేర పరిశోధనల్లో పోలీసులకు ఉపయోగకరంగా ఉంటుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేరాల్లో నిందితులను గుర్తించి దర్యాప్తు ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయడానికే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1920 స్థానంలో ఈ బిల్లు తీసుకొచ్చినట్టు కేంద్రం చెబుతున్నది. అయితే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనదని, క్రూరమైనదని విపక్షాలు విమర్శించాయి.
దోషులతో పాటు నేర నిరూపణ కాని నిందితులు, విచారణలో ఉన్న ఖైదీలు, అనుమానితుల నుంచి వేలి, కాలి, అరచేయి ముద్రలు, ఐరిస్, రెటీనా స్కాన్, చేతిరాత, సంతకం, రక్తం, మూత్రం, వీర్యం వంటి నమూనాలు సేకరించడంతో పాటు ఇతరత్రా పరీక్షలు చేపట్టడానికి ఈ బిల్లు పోలీసులకు అవకాశం కల్పిస్తున్నది.