ముంబై: హిట్లర్ గురించి తాను చేసిన ట్వీట్ ఇజ్రాయెల్ను బాధపెట్టేందుకు కాదని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) తెలిపారు. అయితే ఆ ట్వీట్ తొలగించిన నెల తర్వాత ఇజ్రాయెల్ ఎంబసీ లేఖ రాయడంపై ఆయన స్పందించారు. ఎవరో ప్రేరేపించి ఉండటం వల్లనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తన గురించి లేఖ రాసి ఉంటుందని ఆయన అన్నారు. అక్టోబర్ 14న గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబులతో దాడి చేసింది. ఈ సంఘటనలో నవజాత శిశువులు, పిల్లలతో సహా వందలాది మంది మరణించారు. దీనిపై స్పందించిన సంజయ్ రౌత్, యూదులను హిట్లర్ ఎందుకు అంతగా ద్వేషించాడో అన్నది తాను గ్రహించినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో వెంటనే ఆ ట్వీట్ను తొలగించారు.
కాగా, సంజయ్ రౌత్ ‘యాంటీ సెమిటిక్’ ట్వీట్పై ఇజ్రాయెల్ నిరసన వ్యక్తం చేసింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతోపాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు తాజాగా లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ దీనిపై శనివారం స్పందించారు. తాను తొలగించిన హిట్లర్ ట్వీట్ ఇజ్రాయెల్ను బాధపెట్టడానికి కాదని తెలిపారు. అయితే ఇది జరిగిన నెల తర్వాత ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం నుంచి విదేశాంగ శాఖ, లోక్సభ స్పీకర్కు లేఖ అందడం ఆ ఎంబసీని ఎవరో ప్రేరేపించి ఉండవచ్చన్నది రుజువు చేసిందన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రాంతాలపై హమాస్ దాడి, ఆ దేశ పౌరులను చంపడం, అపహరించడాన్ని తాను ఖండించినట్లు సంజయ్ రౌత్ గుర్తు చేశారు. అలాగే గాజాలోని ఆసుపత్రులపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేయడం, పిల్లలు, నవజాత శిశువులను చంపడం, అత్యవసర వస్తువుల సరఫరాను నిలిపివేయడాన్ని కూడా తాను అదే విధంగా ఖండించినట్లు చెప్పారు. యుద్ధ సమయంలో పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం తగదన్నది తన నమ్మకమని అన్నారు.