చండీగఢ్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ మాదిరి ఘటన హర్యానాలో జరిగింది. బీజేపీ ఎంపీ నయాబ్ సైనీకి చెందిన కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు రైతులు ఆరోపించారు. గాయపడిన రైతును అంబాల సమీపంలోని నారిన్గఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని, అతడి పరిస్థితి సీరియస్గా ఉన్నదని తెలిపారు. తనపైకి బీజేపీ ఎంపీ కారు దూసుకురాగా తృటిలో తప్పించుకున్నట్లు ఒక రైతు ఆరోపించాడు.
కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నయాబ్ సైనీ, హర్యానా మైనింగ్ మంత్రి మూల్ చంద్ శర్మతో సహా ఇతర పార్టీ నాయకులు గురువారం నారిన్గఢ్లోని సైనీ భవన్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, బీజేపీ నేతల పర్యటనను వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఆ భవనం బయట పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
కార్యక్రమం ముగియడంతో బయటకు వచ్చిన బీజేపీ ఎంపీ నయాబ్ సైనీ కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని హర్యానా రైతులు డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీలోపు ఇది జరుగకపోతే పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.