కశ్మీర్: నూతన జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) చేపడుతున్న పాఠ్యాంశాల సవరణ తీవ్ర వివాదాస్పదమౌతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించేందుకు, వాస్తవాలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదనే విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి. పాఠ్యాంశాల తొలగింపుపై మేధావి వర్గం తీవ్రంగా తప్పుపట్టింది. ఎన్సీఈఆర్టీ నిర్ణయం వెనుక విభజన ఉద్దేశం స్పష్టమవుతుందని, ఇది మన రాజ్యాంగ ధర్మానికి, భారత ఉపఖండ సమ్మిళిత సంస్కృతికి వ్యతిరేకమని వారు విమర్శించారు. తాజాగా ఈ జాబితాలో జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) చేరారు. పుస్తకాల నుంచి పాఠ్యాంశాలను తొలగిస్తే చరిత్ర మారిపోదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి మొఘల్స్ చాప్టర్ను (Mughals chapter) తీసేసినంత మాత్రాన చరిత్రను (History) మార్చలేరు. తాజ్మహల్ (Taj Mahal), ఎర్రకోట (Red Fort), ఇతర చారిత్రక కట్టడాలు మన ముందే ఉన్నాయని అబ్దుల్లా అన్నారు. అదేవిధంగా అరుణాచల్ప్రదేశ్లోని (Arunachal Pradesh) 11 ప్రాంతాల పేర్లను చైనా (China) మార్చడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలా జరగడం ఇదే మొదటిసారికాదు. చాలా కాలం నుంచి అరుణాచల్ తమదని బీజింగ్ అంటున్నది. కానీ భారత్ దానిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఆ 11 ప్రాంతాలను చైనా దక్షిణ టిబెట్గా (South Tibet) పిలుస్తున్నది. గత దశాబ్ద కాలంలో ఢిల్లీ, బీజింగ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగాలేవడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు.
కాగా, ‘సిలబస్ రేషనలైజేషన్’ పేరుతో పలు తరగతులకు చెందిన పుస్తకాల్లోని పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్లు ఎన్సీఈఆర్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో మత పరిస్థితులపై గాంధీజీ మృతి ప్రభావం, హిందూ-ముస్లిం ఐక్యతకు గాంధీ చేసిన కృషి, అది హిందూ అతివాదులకు నచ్చకపోవడం, గాంధీజీ హత్యకు గురైన సందర్భంలో ఆరెస్సెస్పై కొంతకాలం పాటు విధించిన నిషేధం వంటి అంశాలను 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి మాయం అయ్యాయి. హిస్టరీతోపాటు హిందీ, సివిక్స్ పుస్తకాల్లోనూ ఎన్సీఈఆర్టీ మార్పులు చేసింది. 10, 11వ తరగతి పుస్తకాల్లోనూ పలు పాఠ్యాంశాలను ఎన్సీఈఆర్టీ తొలగించింది. ఈ మార్పులు 2023-24 విద్యా సంవత్సరం నుంచే అమలవుతాయని పేర్కొన్నది.
మొఘల్ సామ్రాజ్యం చాప్టర్లను ఎన్సీఈఆర్టీ తొలగించింది. 12 తరగతి చరిత్ర పుస్తకంలో థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్-2లో ‘కింగ్ అండ్ క్రానికల్స్ : ది మొఘల్ కోర్ట్స్ చాప్టర్లను ఉపసంహరించారు. 11వ తరగతి సోషియాలజీ పుస్తకంలో ‘అండర్స్టాండింగ్ సొసైటీ’లో.. మతం, వర్గం, జాతులు ప్రజలను ఏవిధంగా విడదీస్తాయి? అనేదానికి గుజరాత్ అల్లర్లను ఉదాహరణగా చూపిన పెరాగ్రాఫ్ను డిలీట్ చేశారు. ఎమర్జెన్సీ, ప్రచ్ఛన్న యుద్ధం, నక్సలైట్ ఉద్యమం తొలగించారు. 2002 మత హింసకు సంబంధించిన అంశాలను డ్రాప్ చేశారు.