న్యూఢిల్లీ : దాయాది పాక్లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కరాచీ నగరంలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కరాచీలోని కోరంగి నెంబర్-5 ప్రాంతంలో జరిగింది. శ్రీమరిమాత ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి సమయంలో దుండగులు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో హిందువులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులను మోహరించారు.
ఆరు నుంచి ఎనిమిది మంది దుండగులు మోటార్ సైకిళ్లపై ఆలయం వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారని స్థానికుడు తెలిపాడు. గత కొద్ది రోజులుగా పాక్లోని హిందూ దేవాలయాలే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. అక్టోబర్లో సింధు నది ఒడ్డున ఉన్న ఓ చారిత్రాత్మక దేవాలయంపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. అధికారిక అంచనాల ప్రకారం, పాక్లో 7.5 మిలియన్ల మంది హిందువులు నివసిస్తున్నారు. అయితే, కమ్యూనిటీ ప్రకారం దేశంలో 90 లక్షల మంది హిందువులు ఉన్నారు. పాకిస్తాన్లోని హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్లో స్థిరపడ్డారు.