వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపీ మసీదుపై నెలకొన్న వివాదంపై కోర్టు వెలుపల ఒక ఒప్పందానికి వద్దామని.. దీనిపై న్యాయపోరాటం చేస్తున్న విశ్వ వేదిక్ సంతన్ సంఘం మసీదు కమిటీకి లేఖ ద్వారా సూచించింది. మసీదులో శాస్త్రీయ సర్వే జరుగుతున్న సమయంలో ఈ ప్రతిపాదన రావడం గమనార్హం.
హిందూ-ముస్లింల మధ్య ఏర్పడిన వివాదాన్ని కొన్ని దుష్టశక్తులు తమ వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం వాడుకుని లబ్ధి పొందాలని చూస్తున్నాయని సంఘం చీఫ్ జితేంద్ర సింగ్ ఆరోపించారు. అదే జరిగితే ఇరు వర్గాలకు చేటు జరుగుతుందన్నారు. దేశ క్షేమం, భద్రతను దృష్టిలో ఉంచుకుని హిందూ-ముస్లిం వర్గాలు పరస్పర చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నారు. ఈ లేఖపై ఇంతెజామియా మసీద్ కమిటీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ యాసిన్ స్పందిస్తూ కమిటీ సమావేశంలో చర్చించి స్పందిస్తామన్నారు.