సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని మట్టికరిపించి స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి సీఎం ఎంపిక కత్తిమీద సాములా మారింది. సీఎం రేసులో ముగ్గురు కీలక నేతలు తలపడుతున్నారు. హిమాచల్ కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్, సీఎల్పీ నేత, విపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి, ప్రచార కమిటీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖు సీఎం రేసులో నిలిచారు.
సిమ్లాలో శుక్రవారం జరిగే సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతను ఎన్నుకోనుండటంతో కీలక పదవిని ఆశిస్తున్న నేతలు తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల వివరాలను పార్టీ పరిశీలకుల దృష్టికి తీసుకువెళుతున్నారు. సుఖు, అగ్నిహోత్రి ఇప్పటికే కాంగ్రెస్ పరిశీలకులు భూపిందర్ సింగ్ హుడా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్ను ఛండీగఢ్లో కలుసుకుని సీఎం పదవికి తమ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్టు సమాచారం.
ఇక వీరభద్ర సింగ్ కుటుంబం నుంచే సీఎం పదవి ఉంటుందని ప్రతిభా సింగ్ చెప్పుకుంటున్నారు. ప్రతిభా సింగ్ను పక్కనపెట్టదలిస్తే ఆమె కుమారుడు సిమ్లా రూరల్ నుంచి గెలుపొందిన విక్రమాదిత్య సింగ్కు కీలక మంత్రిత్వ శాఖను కట్టబెట్టి సింగ్ కుటుంబాన్ని సంతృప్తిపరచవచ్చని భావిస్తున్నారు. సిమ్లాలో శుక్రవారం జరిగే సీఎల్పీ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీకి ఏఐసీసీ హిమాచల్ ప్రదేశ్ ఇన్చార్జి రాజీవ్ శుక్లా, భూపేష్ బఘెల్, భూపీందర్ హుడా ఈ సమావేశానికి హాజరవనున్నారు.