సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు. సుఖు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజస్ధాన్ సీఎం అశోక్ గహ్లోట్, చత్తీస్ఘ్ సీఎం భూపేష్ బఘేల్ హాజరయ్యారు.
హిందువులు అధికంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఘన విజయం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సుఖు అన్నారు. హిమాచల్లో కాషాయ పార్టీ హిందుత్వ అజెండా పనిచేయలేదని ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే తొలి క్యాబినెట్ సమావేశంలోనే పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
హిల్ స్టేట్ నుంచి డ్రగ్స్ను ఏరివేయడం తన ప్రాధాన్యతని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో ఓపీఎస్ పునరుద్ధరణ హామీని కాంగ్రెస్ ప్రధానంగా పొందుపరిచింది. ఇక తన విజయంలో తన తల్లి కీలక పాత్ర వహించిందని సుఖు వెల్లడించారు. ఆమె కేవలం ఐదవ తరగతి చదివినా తనకు ఉన్నత విద్యను అందించారని చెప్పుకొచ్చారు. మరోవైపు గత ప్రభుత్వంలో విపక్ష నేతగా వ్యవహరించిన ముఖేష్ అగ్నిహోత్రి హిమాచల్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.