న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఓ మహిళ నియమితులు కావాల్సిన అవసరం ఉందని, ఆ సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తమలో చాలా మందికి హైకోర్టు జడ్జిలుగా నియమితులయ్యే అర్హతలున్నాయని, మహిళలను ఉన్నత న్యాయపదవుల్లో నియమించాలని కోరుతూ మహిళా లాయర్ల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సుప్రీంకోర్టు ఎల్లవేళలా మహిళల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొంటుందని, న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం మహిళల అర్హతలను తప్పకుండా పరిగణనలోకి తీసుకొంటుందని వ్యాఖ్యానించింది. పురుషులనే ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలన్న వైఖరి ఏమీ లేదని పేర్కొన్నది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒకే ఒక్క మహిళా న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ ఉన్నారు. సీనియారిటీ పరంగా ఆమె 12వ స్థానంలో ఉన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఇంతవరకు ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించలేదు.