Apple | న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: యాపిల్ కంపెనీ ఉత్పత్తులు వాడుతున్న యూజర్లు ‘హై-రిస్క్’లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘సెర్ట్-ఇన్’ హెచ్చరించింది. ఆ కంపెనీ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన లోపం తలెత్తిందని, యూజర్లు తమ డివైజ్ ఓఎస్ను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంటూ బుధవారం అడ్వైజరీ జారీచేసింది. ఐఫోన్, మ్యాక్ బుక్, ఐపాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్స్.. తదితర వాటిల్లో ‘రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్’కు సంబంధించి అత్యంత క్లిష్టమైన భద్రతాపరమైన లోపం తలెత్తినట్టు ‘సెర్ట్-ఇన్’ తెలిపింది.
ఈ లోపం వల్ల హ్యాకర్లు ఏకపక్షంగా కోడ్ను ఎగ్జిక్యూట్ చేసి డివైజ్లను రిమోట్గా ఆపరేట్ చేసే ముప్పు ఉన్నదని హెచ్చరించింది. యూజర్లు తమ డివైజ్లను లేటెస్ట్ సెక్యూరిటీ వెర్షన్తో అప్డేట్ చేసుకోవాలని సూచించింది. పబ్లిక్ వైఫై నెట్వర్క్ను వాడొద్దని, యాప్లను డౌన్లోడ్ చేసేముందు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యమైన సమాచారాన్ని బ్యాకప్ చేసుకోవాలని పేర్కొన్నది. ఐపాడ్, ఐఫోన్, మ్యాక్బుక్లలో ఏ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంకు ముప్పు పొంచి ఉందన్న వివరాలు అడ్వైజరీలో తెలిపింది.