న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ నేవీలు శనివారం రోజున ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి భారీ స్థాయిలో డ్రగ్స్ను స్వాధీనం(Drgus Seized) చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ డ్రగ్స్ విలువ సుమారు 25 వేల కోట్లు ఉంటుందని ఇవాళ ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. అధిక మొత్తంలో మెటాఫెటమైన్ మాదక ద్రవ్యాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ డ్రగ్స్ సుమారు 2525 కిలోల బరువు ఉందని, మార్కెట్లో దాని విలువ 25 వేల కోట్లు ఉంటుందని ఎన్సీబీ ఆఫీసర్లు తెలిపారు.
సముద్రంలో సీజ్ చేసిన డ్రగ్స్ను అంచనా వేసేందుకు 23 గంటల సమయం పట్టిందని, మెటాఫెటమైన్ హయ్యర్ గ్రేడ్ కావడం వల్ల ఆ డ్రగ్స్ విలువ కూడా అధికంగా ఉన్నట్లు అధికారి చెప్పారు. 134 ప్యాకెట్లలో ఆ డ్రగ్స్ను పట్టుకున్నారు. మెటాఫెటమైన్ను ఒక్కొక్క కిలో ప్యాకెట్లలో ప్యాక్ చేశారు. ఈ కేసులో ఓ అనుమానిత పాక్ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ఆ డ్రగ్స్ శ్రీలంక, మాల్దీవులు, ఇండియాకు సరఫరా జరుగుతున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. సముద్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మదర్ షిప్ స్టేషన్ అవుతుందని, చిన్న బోట్లు అక్కడకు వెళ్లి తమ కన్సన్మైంట్లను కలెక్ట్ చేసుకుంటారని ఓ అధికారి చెప్పారు. ఆపరేషన్ సముద్రగుప్తను 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ నాటి నుంచి ఇప్పటి వరకు 4వేల కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.