న్యూఢిల్లీ: అతను ఒక భవన నిర్మాణ కూలీ. ఎక్కడా నికరం లేకుండా రాష్ట్రాలు తిరుగుతూ కూలీ పనులు చేసేవాడు. ఈ క్రమంలో ఎంతో మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై వారిని హత్య చేశాడు. ఇలా 2008 నుంచి 2015 వరకు ఏడేళ్లపాటు అతని అఘాయిత్యాలు కొనసాగాయి. ఆఖరికి 2015లో ఓ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి, హతమార్చిన కేసులో అరెస్టయ్యాడు. ఏళ్ల తరబడి విచారణ అనంతరం ప్రస్తుతం ఢిల్లీ కోర్టు అతడిని దోషిగా తేల్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన రవీందర్ కుమార్ అనే 32 ఏళ్ల వ్యక్తి 2008 నుంచి ఢిల్లీ, హర్యానా, యూపీ తదితర రాష్ట్రాల్లో భవన నిర్మాణ కూలీగా పని చేశాడు. రాత్రి వేళల్లో ఫూటుగా మద్యం సేవించి, సెల్ ఫోన్లలో పోర్న్ వీడియోలు చూసేవాడు. ఆ తర్వాత ఒంటరిగా కనిపించే బాలికలను టార్గెట్ చేసి డబ్బులు, చాక్లెట్లు ఆశ చూపేవాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ తర్వాత విషయం బయటికి చెబుతురాన్న భయంతో వారిని హతమార్చేవాడు.
2015లో కూడా ఢిల్లీలో ఓ ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఆశచూసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రవీందర్ కుమార్ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో అతడు నేరాలను ఒప్పుకున్నాడు. 2008 నుంచి 2015 వరకు మొత్తం 30 మంది చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడి, హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది.
కాగా, రాత్రి కాగానే ఆల్కహాల్ మత్తులోకి వెళ్లే రవీందర్ కుమార్.. టార్గెట్ను వెతుక్కుంటూ నిర్మాణ ప్రదేశాల దగ్గరికి చేరుకునే వాడని, అక్కడ నిర్మాణ సముదాయాల్లోనే షెల్టర్లు ఏర్పాటు చేసుకుని ఉండే కూలీల పిల్లల్లో ఒకరిని టార్గెట్ చేసేవాడని, ఆపై పేరెంట్స్ కన్నుగప్పి టార్గెట్ను కిడ్నాప్ చేసేవాడని, నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి వారిపై లైంగిక దాడి చేయడమేగాక, ప్రాణాలు తీసేవాడని పోలీసులు తెలిపారు.