Karnataka Congress | బెంగళూరు, మార్చి 27: కర్ణాటక కాంగ్రెస్లో లోక్సభ టికెట్ల పంచాయితీ కుంపటి రేపింది. కోలార్ నుంచి రాష్ట్ర మంత్రి కేహెచ్ మునియప్ప అల్లుడు చిక్కా పెద్దన్నకు టికెట్ దక్కనుందనే ప్రచారం నేపథ్యంలో.. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగానే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెద్దన్నకు ఎంపీ టికెట్ ఇస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు హెచ్చరించారు. వీరిలో కోలార్, మలూర్, చింతమణి ఎమ్మెల్యేలు వరుసగా జీ మంజునాథ్, కేవై నంజేగౌడ, ఎంసీ సుధాకర్ ఉన్నారు. వీరి గ్రూపునకు ఎమ్మెల్సీలు అనిల్ కుమార్, నజీర్ అహ్మద్ కూడా తోడయ్యారు. సుధాకర్ సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు.
కోలార్లో ఎస్సీ లెఫ్ట్ సెక్షన్కు చెందిన చిక్కా పెద్దన్నకు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వీళ్లంతా.. ఎస్సీ రైట్ సెక్షన్ వ్యక్తికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నంజేగౌడ మాట్లాడుతూ మునియప్ప ఇప్పటికే మంత్రిగా, ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నారని, ఈ నేపథ్యంలో మళ్లీ వారి కుటుంబానికి చెందిన వ్యక్తికే ఎంపీ టికెట్ ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. జిల్లాకు చెందిన బంగారపేట ఎమ్మెల్యే ఎస్ఎన్ నారాయణ్స్వామి కూడా ఎస్సీ రైట్ అభ్యర్థికే కోలార్ ఎంపీ టికెట్ ఇవ్వాలన్నారు. టికెట్ విషయంలో పార్టీ నిర్ణయం తీసుకొన్న తర్వాత తన కార్యాచరణపై నిర్ణయం తీసుకొంటానని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పిడి అంశాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. భవిష్యత్తులో తనను ముఖ్యమంత్రిని చేయడంపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణలో బుధవారం ఆయన ఓ దేవాలయాన్ని సందర్శించారు. శివకుమార్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ఆ ఆలయ పూజారి ప్రార్థన చేశారు. అనంతరం శివకుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఆ పూజారి తన కోరికను వ్యక్తం చేశారని, ఇందులో తప్పేమున్నదని ప్రశ్నించారు. ‘డిప్యూటీ సీఎంగా, పీసీసీ అధ్యక్షునిగా పనిచేస్తున్న నేను సీఎం కావాలని ఇలాంటి పూజారులు, నా మద్దతుదారులతోపాటు ఎంతో మంది ప్రజలు వాంఛిస్తున్నారు. అలా కోరుకోవద్దని వారిని ఆపగలమా? ఏదేమైనా భవిష్యత్తులో నేను సీఎం కావడంపై నిర్ణయం తీసుకోవాల్సింది మా పార్టీయే. ప్రస్తుతానికి మేమంతా సీఎం సిద్ధరామయ్య కింద పనిచేస్తున్నాం. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోగమించాలన్నదే మా ఆకాంక్ష’ అని శివకుమార్ స్పష్టం చేశారు.