High Court | ఆలయంలోకి వితంతు (Widow) మహిళల ప్రవేశాన్ని నిరాకరించడంపై మద్రాసు హైకోర్టు (Madras High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. వితంతువులను దేవాలయంలోకి ప్రవేశించకుండా నిరోధించడం వంటివి చట్టాల ద్వారా పరిపాలించబడే ఈ నాగరిక సమాజంలో జరగవని పేర్కొంది. తమిళనాడు (Tamil Nadu) ఈరోడ్ (Erode) జిల్లాలోని ఓ వితంతు మహిళ వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా స్పందించింది.
జిల్లాకు చెందిన తంగమణి (Thangamani) అనే వితంతు మహిళను పెరియాకారుపరాయణ్ ఆలయం (Periyakaruparayan temple)లోకి ప్రవేశించేందుకు అక్కడ కొందరు అడ్డుకున్నారు. గతంలో ఆ ఆలయంలో పూజారిగా పనిచేసిన ఆమె భర్త 2017 ఆగస్టు 28న మరణించాడు. అయితే, ఆలయంలో నిర్వహించే ఉత్సవాల్లో కుమారుడితో కలిసి పాల్గొనాలని తంగమణి అనుకుంది. అయితే ఆమె వితంతువు కాబట్టి గుడిలోకి వెళ్లకూడదని చెప్పి వారిని అడ్డుకున్నారు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. వితంతువు ఆలయంలోకి ప్రవేశిస్తే అపవిత్రత వస్తుందన్న ప్రాచీన విశ్వాసం రాష్ట్రంలో నెలకొనడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
‘ఇలాంటివి మనిషి తన సౌలభ్యం కోసం తయారు చేసుకున్న సిద్ధాంతాలు, నియమాలు. భర్తను కోల్పోయిన కారణంగా స్త్రీని అవమానించడం చాలా తప్పు. చట్టబద్దమైన పాలనలో ఉన్న నాగరిక సమాజంలో ఇవన్నీ ఎప్పటికీ కొనసాగవు. ఎవరైనా వితంతువులను ఆలయంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు’ అని న్యాయమూర్తి విచారణ సందర్భంగా తెలిపారు.
ఒక మహిళ తనకంటూ ఒక హోదా, గుర్తింపు కలిగి ఉంటుందని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. ఆమె వైవాహిక స్థితిని బట్టి అది ఏ విధంగానూ దిగజారదని పేర్కొంది. ఆ మహిళను, ఆమె కుమారుడిని పండుగకు హాజరుకాకుండా, దేవుడిని పూజించకుండా ఆపే హక్కు ఎవరికీ లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆగస్టు 9, 10 తేదీల్లో జరిగే ఉత్సవాల్లో తంగమణి, ఆమె కుమారుడు పాల్గొనేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
Also Read..
HIV positive | 16 నెలల్లో 81 మంది గర్భిణి స్త్రీలకు హెచ్ఐవీ పాజిటివ్.. యూపీ ఆసుపత్రిలో ఘటన
Article 370 | ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లు.. అమర్ నాథ్ యాత్రను నిలిపివేసిన అధికారులు
Samantha | నేనూ డబ్బులే సంపాదించాను.. రాళ్లు కాదు..! సమంత సెటైర్