భోపాల్, జూన్ 10: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పేదల పరిస్థితి దయనీయంగా ఉన్నది. మృతదేహాలను భుజాలపై లేదా తోపుడు బండ్లపై తీసుకుపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. సాగర్ జిల్లాలోని గధకోటకు చెందిన ఓ వ్యక్తికి అనారోగ్యంగా ఉండటంతో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇప్పించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకునేంత డబ్బు లేని తాము ఒక తోపుడు బండిలో మృతదేహాన్ని తీసుకుపోయామని భగవాన్ దాస్ అనే మృతుడి బంధువొకరు వాపోయారు. మరో ఘటనలో.. ఖార్గోన్ జిల్లాలోని భగవాన్పూరకి చెందిన శాంతిబాయ్ ఖర్తే అనే ఒక గర్భిణిని ల్లా దవాఖనాకు తరలించేందుకు అంబులెన్స్ పంపాలని విన్నవించుకున్నా అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఒక ఎడ్లబండిపై తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. దీంతో మృతదేహాన్ని అదే బండిలో వెనక్కు తీసుకెళ్లారు.
శవాలను రోడ్డుమీద పడేయాలా?:కర్ణాటక బీజేపీ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మనుషులు చనిపోతే అంత్యక్రియలు చేయటానికి కనీసం శ్మశానాలు కూడా ఏర్పాటుచేయలేకపోతున్నదని ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజలు ఓట్లేసి అధికారం ఇచ్చింది మంచిపనులు చేయటానికే కానీ, నిర్లక్ష్యంగా ఉండటానికి కాదని తీవ్రంగా ఆక్షేపించింది. ‘శ్మశానాలు లేకపోతే మృతదేహాలను రోడ్డుమీద పడేయాలా?’ అని ప్రశ్నించింది. గ్రామాల్లో శ్మశానాలు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మొహ్మ ద్ ఇక్బాల్ అనే వ్యక్తి 2019లో హైకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్ను విచారించిన కోర్టు.. శ్మశానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవటం తో అతడు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీన్ని విచారించి జస్టిస్ బీ వీరప్ప, 15 రోజుల్లో అన్ని గ్రామాల్లో శ్మశానాలు ఏర్పాటుచేయకుంటే రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. నివేదిక ఇవ్వటానికి సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర గా, ‘మీరేమైనా త ప్పిపోయిన వ్యక్తిని వెతుకుతున్నారా?’ అని నిలదీశారు.