Rahul Gandhi : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi), పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandi) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరూ అధికారం కోసం ఆరాటపడుతూ దేశ సంపదను ధనికులకు దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తన చర్యలతో మమతాబెనర్జి బెంగాల్ను నాశనం చేస్తే.. మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్నది ఎన్నికల పోరాటం కాదని, సిద్ధాంతాల పోరాటమని అన్నారు. ఒకవైపు కాంగ్రెస్ ఐక్యత, సౌభ్రాతృత్వం.. మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ద్వేషం, హింస మధ్య పోరాటం జరుగుతోందని న్నారు. హుగ్లీ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ భక్తుడిని అని చెప్పుకుంటూ ప్రధాని మోదీ దేశాన్ని అమ్ముకుంటున్నారని రాహుల్గాంధీ మండిపడ్డారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో ద్వేషాన్ని, భయాన్ని వ్యాపింపజేస్తారన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అన్ని రాష్ట్రాలు లోబడి ఉండాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆ పార్టీ పేదల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, ధనికుల లబ్ధి కోసమే పని చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో సామాన్యుల పురోభివృద్ధి కోసం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి అస్తవ్యస్తం చేస్తోందని అన్నారు.