(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): గురివింద గింజ నీతిని అనుసరిస్తున్నది బీజేపీ. కుటుంబపాలనకు తాము వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ఆ పార్టీ నాయకులు.. సొంత పార్టీలో వారసత్వ రాజకీయాలను మాత్రం విస్మరిస్తున్నారు. గుజరాత్లో త్వరలో జరుగబోయే ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కలిసి 20 మంది సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికె ట్లు ఇచ్చాయి. ఇందులో కమలదళం ఏడుగురు వారసులను బరిలోకి దించనున్నది. ఇటీవల బీజేపీలో చేరిన మోహన్సిన్హ్ రత్వా కుమారుడు రాజేంద్రసిన్హ్కు చోటా ఉదయ్పూర్ నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే రామ్సిన్హ్ పార్మర్ కుమారుడు యోగేంద్ర పార్మర్ను థస్రా నుంచి, కరన్సిన్హ్ పటేల్ కుమారుడు కనూ పటేల్ను సనాంద్ నుంచి, మాజీ ఎంపీ విఠల్ రాధాదియా కుమారుడు జయేశ్ రాధాదియాను జేత్పూర్ నుంచి బరిలోకి దిం చనున్నది. మరో ముగ్గురు ఎమ్మెల్యేల కుమారులను కూడా రానున్న ఎన్నికల్లో కమలదళం పోటీలో నిలిపింది.