Chandrayaan-3 | న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 సాధించిన ఘన విజయం మనకు పైకి కనిపిస్తున్నది. అయితే ఈ లక్ష్యసాధన వెనుక చాలా మంది శాస్త్రవేత్తల, ఇంజినీర్ల అవిశ్రాంత కృషి దాగివున్నదనేది అక్షర సత్యం. ఏ విషయంలోనైనా గెలిచిన తర్వాత వచ్చి అభినందించడం కంటే.. ఆ విజయం సాధించేందుకు అండగా, తోడుగా నిలబడటం చాలా ముఖ్యం. చంద్రయాన్-3 ద్వారా దేశ ప్రతిష్ఠను ప్రపంచ యవనికపై సగర్వంగా నిలిపేందుకు రాత్రింబవళ్లు పనిచేసిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కృషి అనిర్వచనీయమైనది. నెల జీతంతో పొట్ట పోసుకొనే వారికి 17 నెలలుగా వేతనాలు రాకున్నా.. దేశం కోసం, దేశ కీర్తి కోసం ఆ కష్టాలను దిగమింగుతూ కష్టించి పనిచేశారు. వారే జార్ఖండ్లోని రాంచీ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్(హెచ్ఈసీ)కు చెందిన ఇంజినీర్లు, కార్మికులు. చంద్రయాన్ విజయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు హెచ్ఈసీ ఉద్యోగులు కూడా ప్రశంసలకు అర్హులే. అటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే వేతన బకాయిలు చెల్లించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
ఇస్రో ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలి
హెచ్ఈసీ ఇంజీనీర్లు, వర్కర్లు చంద్రయాన్-3 ప్రాజెక్టులో కీలకమైన మొబైల్ లాండ్ ప్యాడ్ను నిర్మించారు. దీంతో పాటుగా ఇతర ముఖ్యమైన పరికరాలను కూడా తయారు చేసి సరఫరా చేశారు. గత 17 నెలలుగా వేతనాలు రాకున్నా.. షెడ్యూ ల్ కంటే ముందుగానే 2022, డిసెంబర్లో లాంచ్ ప్యాడ్, ఇతర పరికరాలను అందజేశారు. అటువంటి వీరికి ఇప్పటికైనా వేతన బకాయిలు విడుదల చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అదేవిధంగా చంద్రయాన్-3కి పనిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు ఇవ్వాల్సిన పదోన్నతులు కల్పించాలని కోరాయి. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘాలు తాజాగా ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. చంద్రయాన్-3 సక్సెస్, ప్రభుత్వ రంగ సంస్థల చెప్పుకోదగ్గ విజయంగా కార్మిక సంఘాలు అభివర్ణించాయి.