షిమ్లా: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దాంతో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మండి జిల్లాలో వర్షాల ప్రభావం మరింత తీవ్రంగా ఉన్నది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగాయి.
బిలాస్పుర్ జిల్లాలోనూ పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాకేష్లో కొండలపై నుంచి మట్టి, రాళ్లు దొర్లిపడి జాతీయ రహదారి 205పై రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని బిలాస్పుర్ జిల్లా యంత్రాంగం తెలిపింది. మరోవైపు మండి నుంచి షిమ్లాకు వెళుతున్న హిమాచల్ప్రదేశ్ ఆర్టీసీ బస్సు లోయలో పడి నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
సోలన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి షిమ్లా-కల్కా మార్గంలో జాతీయ రహదారి 5ను పూర్తిగా మూసివేశారు. మరమ్మతుల అనంతరం ఈ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించగా మరోసారి కొండ చరియలు విరిగిపడటంతో మరోసారి మూసేయాల్సి వచ్చింది. ఆ రాష్ట్రంలో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.