గౌహతి : అసోంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల మధ్య గౌహతిలోని బోరగావ్లో కొండచరియలు విరిగిపడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కామాఖ్య, ఖర్గులి, హెంగేరాబరి, సిల్పుఖురి, చంద్మారి కాలనీలతో సహా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ కౌస్తవ్ పేర్కొన్నారు. ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడిన సంఘటల్లో ఇప్పటి వరకు 42 మంది మృతి చెందారు. స్మార్ట్ సిటీలోని వందలాది ఇండ్లల్లోకి వరద నీరు ప్రవేశించింది.
అలాగే వాహనాల ఇంజిన్లలోకి నీరు వెళ్లడంతో పాఠశాల బస్సులు సహా అనేక వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. జూ రోడ్డు, ఆర్జి బారుహ్ రోడ్, జీఎస్ రోడ్, నబీన్నగర్, అనిల్ నగర్, హతిగావ్, గణేష్గురి, హెదయేత్పూర్, దిస్పూర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్, లచిత్ నగర్, తరుణ్ నగర్, జ్యోతికుచి, ఘోరమారా, విఐపి రోడ్, రాజ్గఢ్ రోడ్, జోరాబత్, చత్రిబరిలో వరదలు వచ్చాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో పలువురు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అధికారులు స్పందించకపోవడంతో తాగునీటికి ఇబ్బందులకు గురయ్యారు.
భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని అన్ని ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు నీరు ప్రవహించగా, కొన్ని చోట్ల నీటి మట్టం నడుము లోతు వరకు నీరు చేరింది. గౌహతి రైల్వే స్టేషన్ అప్రోచ్ రోడ్డు కూడా నీట మునిగింది. ఇదిలా ఉండగా.. అసోం, మేఘాలయలో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 17వ తేదీ వరకు ఈశాన్య రాష్ట్రాలలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం పేర్కొంది.