న్యూఢిల్లీ: దేశ రాజధానిని భారీ వాన ముంచెత్తింది. కేవలం మూడు గంటల్లో 73.2 సెంటీమీటర్ల వాన కురిసింది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయింది. రోడ్లమీద భారీగా నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని సష్దర్గంజ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 2.30 నుంచి 5.30 గంటల వరకు 73.2 సెంటీమీటర్ల వాన నమోదయిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మరో రెండు వారాలపాటు ఇదేవిధంగా వానలు కురుస్తాయని వెల్లడించింది.
ప్రగతి మైదాన్ ప్రాంతంలో రోడ్లు జలపాతాలను తలపిస్తున్నాయి. పండిట్ మార్గ్, మింటో బ్రిడ్జి, విజయ్ చౌక్, ఐటీఓ ప్రాంతం, ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో భారీగా వర్షం కురిసింది. కాగా, మింటో బ్రిడ్జి ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. దీంతో బ్రిడ్జిని ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. ఆజాదీ మార్కెట్ అండర్పాస్లో భారీగా నీరు నిలవడంతో వాహనాలను అనుమంతించడం లేదు. 1.5 ఫీట్ల వరకు నీరు నిలిచిపోవడంతో అండర్పాస్ను మూసివేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
వచ్చే రెండు గంటల్లో ఢిల్లీ పరిధిలోని బహదూర్గడ్, ఫరీదాబాద్, వల్లభ్గఢ్, హిండన్ ఏఎఫ్ స్టేషన్, ఘజియాబాద్, ఇందిరపురం, నోయిడా, గ్రేటర్ నోయిడాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా దేశరాజధాని చుట్టూఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా వానలు పడతాయని తెలిపింది. కాగా, వాతావరణ శాఖ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. అదేవిధంగా ఈనెల 23 నుంచి 26 వరకు గ్రీన్ అలర్ట్ను జారీచేసింది.