Heart Attacks | ఇప్పుడంతా ఉరుకులు పరుగుల జీవితం.. వేళకు భోజనం.. కంటికి సరిపడా నిద్ర లేక ఇబ్బందులు పడుతున్న వారు కోకొల్లలు. దీంతో యుక్త వయస్సులోనే గుండె సంబంధ వ్యాధుల భారీన పడుతున్నారు. అకస్మిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. గత ఆరు నెలల్లో గుజరాత్ రాష్ట్రంలో అకస్మిక గుండెపోటు వల్ల 1052 మంది మరణిస్తే వారిలో 11-25 ఏండ్ల మధ్య వయస్కులు 80 శాతం మంది ఉన్నారు.
ఉపాధి కోసం పల్లెల నుంచి యువత పట్టణాలకు తరలి రావడం.. జనం రద్దీతోపాటు పర్యావరణ సమస్యలతో కార్డియో వాస్క్యులర్ వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నది. ఇదే గుండెపోటుతో అకస్మిక మరణాలకు దారి తీస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.
ఈ అనూహ్య మరణాలకు చెక్ పెట్టేందుకు దేశవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులకు, ఫిట్ నెస్ నిపుణులకు ‘సీపీఆర్’ టెక్నిక్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నిపుణులకు ‘సీపీఆర్’పై శిక్షణ ఇస్తారు. దేశంలో గుర్తింపు పొందిన ఆరోగ్య, వైద్య కేంద్రాల ద్వారా ఈ శిక్షణ కొనసాగుతుంది.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం 2021లో 50,734 మంది అకస్మిక మరణాలు సంభవిస్తే, 2022లో 56,450 మంది చనిపోయారు. గుండెపోటు వల్ల 2021లో 28,413 మంది మరణిస్తే 2022లో 32,457 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే 2021తో పోలిస్తే గతేడాది గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య 12.5 శాతం పెరిగింది.