ICU Admission | ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో రోగులకు చికిత్సకు సంబంధించి కేంద్రం మంగళవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రోగి అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకునేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రత్యేకంగా రోగులను పరీక్షించడానికి ప్రోటోకాల్స్ అందుబాటులో ఉన్నాయి. భారత్లో పలు సందర్భాల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న సమయంలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఐసీయూలో రోగుల అడ్మిషన్కు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రిలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, వారి బంధువులు నిరాకరించిన సందర్భంలో ఐసీయూలో చేర్చుకోలేరని తెలిపింది.
ఐసీయూ అడ్మిషన్కు సంబంధించిన ఈ మార్గదర్శకాలను క్రిటికల్ కేర్ మెడిసిన్లో ప్రత్యేక అనుభవం ఉన్న 24 మంది ఉన్నత వైద్యుల ప్యానెల్ తయారు చేసింది. రోగిని ఐసీయూలో ఉంచాల్సిన వైద్య పరిస్థితుల జాబితాను ప్యానెల్ రూపొందించింది. ప్రత్యేక పర్యవేక్షణ అవసరమయ్యే ఏ రోగికైనా క్లిష్ట అనారోగ్యం ఉన్న సందర్భాల్లో కూడా ఐసీయూ సిఫారసు చేస్తారు. ప్యానల్లోని నిపుణుల్లోని ఒకరు మాట్లాడుతూ.. ఐసీయూ పరిమిత వనరులున్నాయి. ప్రతి ఒక్కరినీ చేర్చుకోవడం ద్వారా, అత్యవసర కేసుల్లో రోగులు అవసరమైనప్పుడు పడకలు అందుబాటులో ఉండకపోవచ్చని.. కాబట్టి ఈ మార్గదర్శకాలు అవసరమన్నారు. దాంతో రోగి కుటుంబానికి, ఆసుపత్రి పరిపాలనకు మధ్య పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
రోగికి తదుపరి చికిత్స సాధ్యం కాని పక్షంలో, లేదంటే చికిత్స అందుబాటులో లేని సమయంలోనైనా, చికిత్స ఇచ్చినా రోగి ఆరోగ్యంపై ఫలితం చూపకపోతే రోగి మనుగడపై ప్రభావం చూపించకుంటే ఐసీయూలో ఉంచడం వృథా అని నిపుణుల బృందం మార్గదర్శకాల్లో పేర్కొంది. రోగి జీవించే అవకాశాలు లేని సమయంలో ఐసీయూల్లో చేర్చుకోకూడదని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. మహమ్మారి, విపత్తు పరిస్థితులు, వనరులు పరిమితంగా ఉన్న సమయంలో రోగిని ఐసీయూలో ఉంచడంపై తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. రోగి ఆర్గన్స్ వైఫల్యం, ఆర్గాన్ సపోర్ట్ సమయంలో, లేదంటే వైద్య పరిస్థితి క్షీణతను అంచనా వేయడంపై ఐసీయూలో చేర్చుకోవడం ఆధారపడి ఉండాలని చెప్పింది.
అలాగే కార్డియోవాస్కులర్, రెస్పిరేటరీ ఇన్స్టెబిలిటీ, సర్జరీలు చేయించుకున్న రోగులను సైతం ఐసీయూ అడ్మిషన్ మార్గదర్శకాల్లో చేర్చారు. ఐసీయూలో చేర్చుకునే రోగులకు ముందు బీపీ, పల్స్ రేటు, శ్వాసకోశ రేటు, శ్వాస విధానం, హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ సాచురేషన్ తదితర అంశాలను పర్యవేక్షించాలని మార్గదర్శకాల్లో తెలిపింది. కొన్ని సందర్భాల్లో రోగిని ఐసీయూలో ఉంచడం చాలా అవసరం ప్యానెల్ అభిప్రాయపడింది. శస్త్రచికిత్స తర్వాత పరిస్థితి మరింత దిగజారినప్పుడు.. శస్త్రచికిత్స తర్వాత సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్న రోగులను ఐసీయూలో చేర్చడం అవసరమని తెలిపింది.