న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కొవిడ్ నియమావళి అనే 5-ఫోల్డ్ స్ట్రాటజీ (ఐదంచెల వ్యూహం)పై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ అన్ని రాష్ట్రాలకు సూచన చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. COVID-19 కట్టడికి సంబంధించిన సన్నద్ధతను పరిశీలించడానికి తాము మరోసారి మాక్ డ్రిల్ నిర్వహిస్తామని ఆ ప్రకటనలో తెలిపింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ ఉంటాయని పేర్కొంది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.65 కోట్ల డోస్ల వ్యాక్సిన్లు ఇచ్చామని పేర్కొంది. కొవిడ్ బారినపడి ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరుగుతున్న దాఖలాలు ఏమీ లేవని, ప్రికాషన్ డోస్లను పెంచాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. అన్ని రకాల తీవ్రమైన శ్వాససంబంధ వ్యాధులకు సంబంధించి ల్యాబ్లలో పర్యవేక్షణలు, పరీక్షలను కూడా పెంచాల్సిన అవసరం ఉందని తెలియజేసింది.
ఇన్ఫ్లుయెంజా, కొవిడ్-19 కట్టడికి అవసరమైన ఔషధాలు, వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను కోరింది. అదేవిధంగా కొవిడ్ వార్డుల్లో పడకల సంఖ్యను, కావాల్సినంత మంది ఆరోగ్య కార్యకర్తలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.