న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. ప్రస్తుతం 15 సంవత్సరాలుపై బడిన వారందరికీ టీకాలు వేస్తున్న విషయం విధితమే. 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చినా.. ఇంకా పంపిణీ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో 5-15 సంవత్సరాల పిల్లలకు టీకాలు వేసే విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొవిడ్ టీకాలపై నిపుణుల బృందం సిఫారసు చేసిన వెంటనే వ్యాక్సిన్లు వేస్తామని పేర్కొన్నారు. అయితే, దీనికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ ఎలాంటి సిఫారసు చేయలేదని తెలిపారు. సాధారణ బడ్జెట్పై బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించిన ఓ కార్యాకమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ వయసు వారికి టీకాలు ఎప్పుడు వేయాలో శాస్త్రవేత్తల బృందం సిఫారసుల ఆధారంగానే నిర్ణయం ఉంటుందన్నారు.
దేశంలో గత నెలలో 15-18 సంవత్సరాల లోపు పిల్లలకు టీకాల పంపిణీ ప్రారంభమైందన్న ఆయన.. ప్రస్తుతం టీకాలు వేయడం సమస్య కాదన్నారు. ప్రభుత్వం వద్ద అవసరమైనన్ని వ్యాక్సిన్లు ఉన్నాయని, కొరత లేదని స్పష్టం చేశారు. తాము ఖచ్చితంగా నిపుణుల సిఫారసులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు.