‘స్టే హోం.. స్టే సేఫ్’
వ్యక్తిగత పాసుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సీపీ అంజనీకుమార్
‘లాక్డౌన్ మనకోసమే. కలిసికట్టుగా కరోనాను కట్టడి చేద్దాం. అనవసరంగా రోడ్లపైకి రావొద్దు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలు సీజ్ చేస్తాం’ అని నగర సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన వారు మాత్రం తమ పనులకు వెళ్లాలని సూచించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన లాక్డౌన్ పర్యవేక్షణకు స్వయంగా రంగంలోకి దిగిన ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. చార్మినార్ వద్ద ‘స్టే హోం… స్టే సేఫ్’ అనే నినాదంతో నగర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 168 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో చెక్పోస్టు వద్ద సబ్ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించామన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారి సహాయకులకు అనుమతి ఇస్తున్నామని, నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే వారు తమ వాహనాలపై ఏ4 సైజ్ పేపర్పై వివరాలను రాసి ముందు అద్దంపై అతికించుకోవాలని చెప్పారు. వ్యక్తిగత పాసుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బుధవారం సుమారు 700 పాసులు మంజూరైనట్లు వెల్లడించారు. సీపీ వెంట అదనపు సీపీలు అనిల్కుమార్, చౌహాన్, జాయింట్ సీపీ విశ్వప్రసాద్, డీసీపీ గజారావు భూపాల్, టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి తదితర అధికారులు ఉన్నారు.