న్యూఢిల్లీ, మార్చి 11: సుప్రీం కోర్టు మార్గ నిర్దేశాలను అతిక్రమిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా జారీ చేసిన ఆదేశాలను పాటించబోమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తేల్చి చెప్పింది. ఎల్జీ రాజకీయ నియమితుడిగా వ్యవహరించడం మాని ఎన్నికైన ప్రభుత్వం తన పని తాను చేసేందుకు సహకరించాలని ఆ పార్టీ ఒక ప్రకటనలో కోరింది. విద్యుత్తు రాయితీలను నియంత్రించాలని డీఈఆర్సీ ఇచ్చిన సలహాను మంత్రి మండలి ముందు ఉంచి 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎల్జీ ఢిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఇటీవల కోరారు. దీనిపై ఆప్ స్పందిస్తూ ‘కరెంటు రాయితీలు ఉపసంహరించుకోమని ఆయన ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. సీఎం కేజ్రీవాల్ అదెప్పటికీ జరగనీయరు’ అని పేర్కొంది. ఎల్జీ నుంచి నేరుగా వచ్చే ఆదేశాలను పాటించొద్దని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు గత నెలలో ఆప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.