Karnataka | బెంగళూరు, నవంబర్ 21: కర్ణాటక రాజకీయాల్లో ‘నీలి చిత్రాల’ దుమారం రేగింది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్పై మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. శివకుమార్ గతంలో నడిపిన సినిమా హాళ్లలో నీలి చిత్రాలు (పోర్న్ ఫిల్మ్స్) ప్రదర్శించేవారంటూ ఆరోపించారు.
దొడ్డనహళ్లి, కనకపుర సమీపంలోని సతనూర్లలో ఆయన నిర్వహించే సినిమా థియేటర్లలో అశ్లీల చిత్రాలు ప్రదర్శించేవారని చెప్పారు. ‘ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు అటువంటి నేతను ఎన్నుకొన్నారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ అధికారం అప్పగించింది. ఇదీ.. అతని (డీకే శివకుమార్) సంస్కృతి’ అంటూ పేర్కొన్నారు. ఈ ఆరోపణలను డీకే ఖండించారు.
కనకపురకు వెళ్లి ప్రజలను అడగండి..
కుమారస్వామి ఆరోపణలపై డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గం కనకపురకు వెళ్లి, తాను అటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డానో? లేదో? అక్కడి ప్రజలకు అడిగి తెలుసుకోవాలని అన్నారు. ఆయన చేసిన ఆరోపణలను నిరూపిస్తే లేదా ఎవరైనా తాను అటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డానని చెబితే, తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని కుమారస్వామికి సవాల్ విసిరారు. తనకు థియేటర్లు ఉన్నాయని ఒప్పుకొన్న డీకే.. ఇప్పుడు చేస్తున్న నీలి చిత్రాల ప్రదర్శనల ఆరోపణలను కుమారస్వామి గానీ, ఆయన తండ్రి హెచ్డీ దేవెగౌడ కానీ గతంలో తనకు వ్యతిరేకంగా పోటీచేసిన సమయంలో ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తలేదని, ప్రజలకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
తెగని బోర్డులు, కార్పొరేషన్ల పదవుల పంచాయితీ!
మరోవైపు కర్ణాటక కాంగ్రెస్లో సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లలో పదవుల నియామకంపై ప్రభుత్వంలోని, పార్టీలోని పెద్దల మధ్య సయోధ్య కుదరలేదు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇతర సీనియర్ నేతలు ఎవరికి వారు తమ వర్గం ఎమ్మెల్యేలు, నేతలను ఆయా పదవుల్లో కూర్చొబెట్టేందుకు పట్టు బట్టడంతో ఈ అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ రాష్ట్ర ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలను బెంగళూరుకు పంపుతున్నది. ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్ల పదవుల నియామకాలతోపాటు పలు పార్టీ అంశాలపై కూడా చర్చ జరుగుతుందని డీకే పేర్కొన్నారు. అన్ని నియామకాలు ఒక్కసారి జరుగవని, రెండు, మూడు దశల్లో ఉంటాయని వెల్లడించారు.