నూతన సాగు చట్టాల అమలుపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాల అమలు విషయంలో తాము ముందుకే సాగుతామని ఆయన కీలక ప్రకటన చేశారు. నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ… వ్యవసాయాన్ని గాడిలో పెట్టే చట్టాలను తాము తెచ్చామని, అయినా ఇది కొందరికి రుచించలేదని ప్రతిపక్షాలకు చురకలంటించారు.
”స్వాతంత్రం సిద్ధించి 70 సంవ్సరాలైన తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ విప్లవాత్మకమైన మార్పులను తీసుకురాగలిగాం. అయినా కొందరికి రుచించలేదు. మాకేమీ భయం లేదు. మేము ఓ అడుగు వెనక్కి వేశాం అంతే.. మళ్లీ ముందుకే సాగుతాం.స్వల్ప మార్పులతో మళ్లీ తెస్తాం. ఎందుకంటే ఈ దేశానికి రైతులే వెన్నెముక. ఈ వెన్నెముక బలపడిందంటే దేశం దానంతటదే ముందుకు సాగుతుంది” అని తోమర్ సంచలన ప్రకటన చేశారు. ఇక… వ్యవసాయ క్షేత్రంలో మరింత పెట్టుబడులు రావాల్సిన అవసరం మాత్రం ఉందని తోమర్ నొక్కి చెప్పారు. వ్యవసాయం రంగం అతి పెద్ద రంగమైనా, పెట్టుబడుల విషయంలో ఎందుకో కాస్త వెనుకబడిందని తోమర్ పేర్కొన్నారు.