జాతి సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అర్బన్ నక్సలిజం మనస్తత్వం కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మన తల్లులు, చెల్లెళ్ల మంగళ సూత్రాలను కూడా వదలరు. దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి (ముస్లింలకు) పంచుతారు. ఇది మీకు సమ్మతమేనా?
– ఆదివారం రాజస్థాన్లోని జాలౌర్ ఎన్నికల ప్రచారంలో మోదీ
అధికారంలోకి వచ్చాక ప్రజల వద్ద ఉన్న బంగారం సహా సంపదనంతా సర్వే చేసి అందరికీ సమంగా పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పింది. అంటే మన అక్కా-చెల్లెళ్లు, తల్లుల మంగళ సూత్రాలను దోచుకొనేందుకు వాళ్లు చట్టాలను కూడా మార్చేస్తారు. ఎవరికైనా రెండు ఇండ్లు ఉంటే, ఒక ఇంటిని లాగేసుకొంటారు. ఎన్నో దేశాలను నాశనం చేసిన ఈ విధానాలు మనకు కావాలా?
– సోమవారం యూపీలోని అలీగఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
PM Modi | న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ‘హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నామం’టూ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోలోపల భయపడుతున్నారా?’ ఫేస్బుక్లో ఓ నెటిజన్ ప్రశ్న. ‘పదేండ్ల తమ పాలనకు రెఫరెండమ్గా మారిన ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి తప్పకుండా బుద్ధి చెప్తారని మోదీకి ముందే తెలుసా? అందుకే, ప్రచార సభల్లో ప్రధానినన్న విషయాన్ని కూడా మరిచిపోయి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారా?’ ఎక్స్లో మరో వ్యక్తి పోస్ట్. సోషల్మీడియాలో ఏ వేదికను తెరిచినా ఇవే కామెంట్లు, పోస్టులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఆదివారంనాడు రాజస్థాన్లోని జాలౌర్ ఎన్నికల సభలో, సోమవారం యూపీలోని అలీగఢ్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపూరితమైన వ్యాఖ్యలను విశ్లేషిస్తే, బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకొన్నట్టు కనిపిస్తున్నదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవైపు మండిపోతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు, మరోవైపు ఆకాశాన్నంటిన నిత్యావసరాలు, ఇంకోవైపు తారాస్థాయికి చేరిన నిరుద్యోగం.. వెరసి పదేండ్ల బీజేపీ సర్కారు పాలనపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని లోక్నీతి-సీఎస్డీఎస్ ఇటీవల చేసిన సర్వే తేల్చి చెప్పింది. నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని ఈ సర్వేలో పాల్గొన్న 62 శాతం మంది పేర్కొనగా.. ధరల మంటతో పేద, మధ్యతరగతి బతుకులు చిన్నాభిన్నమౌతున్నాయని 71 శాతం మంది కుండబద్దలు కొట్టారు. సరిగ్గా ఎన్నికల ముందే బయటపడ్డ ఎన్నికల బాండ్ల వివాదం బీజేపీకి పెద్ద షాక్నిచ్చింది.
ఇక, ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ దాడులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటి ప్రముఖుల అరెస్టు, వీటితోపాటు గతంలో మణిపూర్లో చెలరేగిన హింస, మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు, సాగుచట్టాలకు సంబంధించి రైతన్నల నిరసనలు, ప్రాణత్యాగాలు, పెద్దనోట్ల రద్దు వంటి విషయాలు.. అధికార బీజేపీ ప్రభుత్వంపై సామాన్యుల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. వెరసి గడిచిన పదేండ్లలో చెప్పుకొందామంటే గొప్ప పనులంటూ ఏమీ లేకపోవడంతోనే ప్రధాని మోదీ మతాల పేరిట విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘400 సీట్లు పక్కా!’ అంటూ పైకి గప్పాలు కొడుతున్నప్పటికీ, విజయావకాశాలపై బీజేపీ నేతలకు అనుమానాలు ఉన్నట్టు మోదీ వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతున్నదని పలువురు పోస్టులు పెడుతున్నారు.