చండీగఢ్ : ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాయు కాలుష్యం పెరుగుతున్నది. పిల్లలకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇప్పటికే శుక్రవారం నుంచి దేశ రాజధానిలో ఆప్ సర్కారు పాఠశాలలను మూసివేసింది. తాజాగా ఎన్సీఆర్ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల్లోని పాఠశాలలను మూసివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఝజ్జర్ జిల్లాల్లో పాఠశాలను మూసే ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఎన్సీఆర్ పరిధిలోని 14 జిల్లాల్లో వాయు కాలుష్యం నేపథ్యంలో కాలుష్యానికి కారణమయ్యే నిర్మాణ పనులపై సైతం నిషేధం విధించారు. అలాగే డీజిల్ జనరేటర్ల వాడకాన్ని నిషేధించగా.. ఈ మేరకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఇంధనశాఖను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేలా చూడాలని అదనపు ప్రధాన కార్యదర్శి పట్టణ, కంట్రీ ప్లానింగ్, పీడబ్ల్యూడీ, పట్టణ స్థానిక సంస్థలు, హర్యానా కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిని కోరారు. ప్లంబింగ్ పనులు, ఇండ్లు, ప్లాట్లలో ఇంటీరియర్ డెకరేషన్, ఎలక్ట్రికల్, వడ్రంగి పనులు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు.