ఛండీఘడ్ : హర్యానా హోంశాఖ, ఆరోగ్యశాఖల మంత్రి అనిల్ విజ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో చికిత్స నిమిత్తం ఆయన ఛండీఘడ్లోని పోస్టు గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్) లో చేరారు. గతేడాది కరోనా బారినపడిన అనిల్ విజ్ దాదాపు నెలపాటు దవాఖానలో చికిత్స పొందారు. గతేడాది నవంబర్ 20న కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్లో తొలి వాలంటీర్గా ఆయన టీకా పొందారు. అనంతరం కరోనా బారినపడటంతో చికిత్స నిమిత్తం అంబాలలోని కంటోన్మెంట్ సివిల్ హాస్పిటల్లో చేరారు. గత వారం రోహ్తక్లో జరిగిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సోదరుడి అంత్యక్రియలకు అనిల్ విజ్ వెళ్లారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రితో కలిసి హెలికాప్టర్లో అధిక ఎత్తులో ప్రయాణం చేశారు. అప్పటి నుంచి ఆయన ఆక్సిజన్ స్థాయిలో హెచ్చుతగ్గులు మొదలవుతున్నాయని సమాచారం. ఉపిరితిత్తులు, శ్వాసకోశ వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.